కలం, మహబూబ్నగర్ బ్యూరో : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR 2026) కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ ప్రియాంక (Collector Priyanka) పిలుపునిచ్చారు. చనిపోయిన వ్యక్తుల పేర్లు, డబుల్ ఓట్లను తొలగించి ఓటరు జాబితాను మరింత ప్రామాణికంగా రూపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని ఆమె తెలిపారు. ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు గురువారం మహబూబ్నగర్లో 2కే రన్ నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ నుంచి ప్రారంభమైన ఈ రన్ సత్యనారాయణ చౌరస్తా వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ప్రియాంక కలెక్టరేట్ ఆవరణలో జెండా ఊపి రన్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎస్ఐఆర్ కార్యక్రమం ఓటర్ల పేర్లను తొలగించేందుకు కాదని, ఓటరు జాబితాను మరింత ఖచ్చితంగా, విశ్వసనీయంగా తయారు చేయడానికే చేపడుతున్న ప్రక్రియ అని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ గురువారం నుంచి వచ్చే నెల 24వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలోని ప్రతి ఓటరును బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు) సంప్రదించి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేస్తారని, ఓటర్లు వాటిని సక్రమంగా నింపి తిరిగి సమర్పించడం ద్వారా తమ పేరు ఓటరు జాబితాలో కొనసాగుతున్నట్లు నిర్ధారించుకోవాలని సూచించారు.
నిజమైన, పారదర్శకమైన ఓటరు జాబితా తయారు చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్న కలెక్టర్, నెల రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో ప్రజలు చురుకుగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 2కే రన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమేష్, జెడ్పీ సీఈవో శ్రీనివాస్ రావు, డీఎస్పీ నల్లపు లింగయ్య, కలెక్టరేట్ ఏవో అనిల్, డీవైఎస్వో వెంకటేష్ శెట్టి, డీపీఆర్వో రషీద్, సీఐ శివశంకర్, తహసీల్దార్ అమరేంద్ర కృష్ణ, వివిధ శాఖల అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

