కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని గైనిక్ వార్డ్, ఎన్ఐసీయూ విభాగాలను సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది హాజరును, పేషంట్ల కేస్ షీట్లను తనిఖీ చేశారు. ప్రతీ రోజు సగటున ఎన్ని ప్రసవాలు జరుగుతున్నాయి, మాతా శిశు మరణాలు ఏమైనా చోటుచేసుకున్నాయా, అవసరమైన ఔషధాలు అన్ని అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. జీజీహేచ్(GGH) లో అన్ని చోట్ల సీ.సీ కెమెరాలు నిరంతరంగా పని చేసేలా చూడాలన్నారు.
మాతాశిశు సంరక్షణ ఆసుపత్రిని సైతం కలెక్టర్ సందర్శించి, సంబంధిత విభాగాల వైద్య సేవలను పూర్తి స్థాయిలో అందించాలని, చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు మెరుగైన వైద్యం అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని, సమయ పాలన పాటించాలని సూచించారు. అత్యవసరం అయితేనే సి.సెక్షన్ లు చేయాలని, సాధ్యమైనంత వరకు సాధారణ కాన్పులు జరిగేలా కృషి చేయాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, వైద్యులు, సిబ్బంది అందరూ అంకితభావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని అన్నారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను, పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ (Collector Ila Tripathi) వెంట వైద్యాధికారులు డాక్టర్ ఎల్.రాములు, జలగం తిరుపతి రావు తదితరులు ఉన్నారు.
Read Also: ఆయన జాతిపిత ఎలా అవుతారు ? : కేసీఆర్ పై కడియం ఫైర్
Follow Us On : WhatsApp


