తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Ila Tripathi) అధికారులను ఆదేశించారు. భీంగల్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని మండలాల ఎంపీడీఓ (MPDO)లు, ఆర్‌డబ్ల్యూఎస్(RWS) ఏఈ (AE) లు, ఎంపీఓ (MPO) లు ఇతర అధికారులతో కలెక్టర్ తాగునీరు సరఫరా తీరుతెన్నులపై సమీక్ష నిర్వహించారు. ఒక్కో మండలం వారీగా నీటి సరఫరా పరిస్థితి గురించి, అందుబాటులో ఉన్న నీటి వనరులు, చేపట్టాల్సి ఉన్న మరమ్మతులు తదితర వాటి గురించి అడిగి తెలుసుకున్నారు.

కలెక్టర్ ఆదేశాలు, సూచనలు..

వేసవి సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని తాగునీటి సరఫరా వ్యవస్థను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ నీటి ఎద్దడి రాకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ, అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పనులు చేపట్టడానికి ముందు స్థానిక ప్రజాప్రతినిధులను సంప్రదించాలని సూచించారు. ఆయా గ్రామాల వారీగా నీటి సరఫరా పరిస్థితిని నిరంతరం సమీక్షించాలని, చేతి పంపులు, బోరు బావులకు అవసరమైన చోట తక్షణమే మరమ్మతులు జరిపించాలన్నారు. చేతి పంపులకు ఫ్లషింగ్ చేయించాలని అన్నారు. జూన్‌లో విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నందున హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లకు నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. నివాస ప్రాంతాలతో పాటు అన్ని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలకు సమృద్ధిగా శుద్ధి జలాలు సరఫరా అయ్యేలా చూడాలన్నారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ పట్టణాలలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, ఎక్కడైనా లోపాలను గుర్తిస్తే వెంటనే వాటిని సరిచేయాలన్నారు. వాటర్ ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయించాలని, ఎంపీఓ (MPO)లు, ఏఈ (AE) లు నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, ఆర్‌డబ్ల్యూఎస్ (RWS) ఎస్ఈ (SE) రాజేందర్, డీపీఓ (DPO) శ్రీనివాస్ రావు, మిషన్ భగీరథ ఈఈ (EE) రాకేష్, నియోజకవర్గం పరిధిలోని మండలాల ఎంపీడీఓ(MPDO) లు, ఏఈ(AE)లు, ఎంపీఓ(MPO)లు పాల్గొన్నారు.

తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి సమగ్ర ప్రతిపాదనలు

అన్ని అధునాతన వసతులతో ప్రభుత్వం నిర్మించదలచిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి సమగ్ర ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను ఆదేశించారు. భీమ్గల్ మండలం గోన్ గొప్పుల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి అనువైన పరిస్థితులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అదనపు తరగతి గదులతో పాటు, ల్యాబ్ రూమ్‌లు, లైబ్రరీ, కంప్యూటర్ గదులు, ఆర్ఓ ప్లాంట్, బోర్ వెల్ తదితర నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ తదితరులు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>