కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో వైద్యసేవలు మరింత విస్తృతం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా హైదరాబాద్లో టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అత్యాధునిక టెక్నాలజీతో వైద్యసేవలు అందించేందుకు నగరంలోని సనత్ నగర్లో నిర్మించిన టిమ్స్ (Sanath Nagar TIMS) ఆసుపత్రిని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోమవారం ప్రారంభించారు. డా. మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్గా నామకరణం చేసిన ఈ ఆసుపత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రజారోగ్య మౌలిక వసతుల్లో మరో కీలక అధ్యాయంగా మారనుందని అభివర్ణించారు. అధునాతన, అందుబాటు ధరల్లో సమగ్ర సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే ప్రతిష్ఠాత్మక సంస్థగా సనత్ నగర్ టిమ్స్ నిలువనుందని పేర్కొన్నారు.
సనత్ నగర్లో ఏర్పాటు చేసిన మర్రి చెన్నారెడ్డి టిమ్స్ను 22.67 ఎకరాల్లో 5 బ్లాకులుగా నిర్మించారు. రెండు బ్లాకులు అడ్మినిస్ట్రేషన్, రీసెర్చ్ కోసం కేటాయించారు. ఇక మిగతా 3 బ్లాకుల్లో వివిధ రకాల వైద్య సేవలు అందించేందుకు సిద్ధం చేశారు. బ్లాక్ – ఏలో ఎమర్జెన్సీ సేవలు, నాలుగు ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేశారు. ఇక బ్లాక్ – బీలో అవుట్ పేషంట్ (OP) సేవలు, ఫార్మసీ, డయాగ్నోస్టిక్ సేవలు, 11 ఆపరేషన్ థియేటర్లు సిద్ధంగా ఉంచారు. త్వరలో ఇక్కడే క్యాథ్ ల్యాబ్ అందుబాటులో రానుంది. బ్లాక్ – సీలో మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ ల్యాబ్లు, సీటీ, ఎంఆర్ఐ టెస్ట్లు, వీఐపీ సూట్ రూమ్స్, పెయిడ్ రూమ్స్, ఫారిన్ పేషంట్ల కోసం ప్రత్యేకంగా ఒక ఫ్లోర్ ను కేటాయించారు.

