కలం, వరంగల్ బ్యూరో: హనుమకొండ (Hanumakonda) ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఈనెల 5, 6, 7 తేదీల్లో మెగా రైతు మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాకు సంబంధించిన ఏర్పాట్లు సమన్వయంతో, ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్టంగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ (Chahat Bajpai) అధికారులను ఆదేశించారు. ఆదివారం హనుమకొండ కలెక్టరేట్ నుండి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంబంధిత శాఖల అధికారులతో మెగా రైతు మేళా ఏర్పాట్లపై సమీక్షించారు. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహిస్తున్న రైతు వారోత్సవాల సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రైతులకు ఉపయోగపడేలా ఈ మేళాను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం, పంటల నిర్వహణలో ఉత్తమ విధానాలు పరిచయం చేసే విధంగా స్టాళ్లను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. మూడు రోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమానికి తగిన విధంగా తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, రవాణా, భద్రత తదితర అన్ని సదుపాయాలు సమృద్ధిగా కల్పించాలని పేర్కొన్నారు.
వ్యవసాయ, రోడ్లు & భవనాలు, విద్యుత్, పోలీస్, మున్సిపల్, మెప్మా తదితర శాఖల మధ్య సమన్వయం పెంచి, ప్రతి అంశాన్ని ముందుగానే ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్ నిర్వహణ సక్రమంగా జరగాలని సూచించారు. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. మెగా రైతు మేళాను సమష్టిగా విజయవంతం చేసి, రైతులకు ఉపయోగకరమైన వేదికగా నిలపాలని కలెక్టర్ (Chahat Bajpai) పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత, అదనపు కలెక్టర్ రవి, ఆదనవు డీసీపీ ప్రభాకర్ రావు, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్, డీఆర్డీఓ మేన శ్రీను తదితర అధికారులు పాల్గొన్నారు.
Read Also: ఫస్ట్ ఇంప్రెషన్ను పాడుచేసే అలవాట్లు ఏంటో తెలుసా?
Follow Us On: Sharechat

