కలం, నిర్మల్: ప్రభుత్వ రంగ పాడి పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) అన్నారు. జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో విజయ డెయిరీ పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ డెయిరీ ద్వారా పాడి రైతులకు అందుతున్న సేవలు, పాల సేకరణ సామర్థ్యం పెంపు, మార్కెటింగ్ లో చేపట్టాల్సిన మార్పులపై చర్చించారు. నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పాడి పరిశ్రమను లాభాల బాటలో నడిపించేందుకు క్షేత్రస్థాయిలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని ఆదేశించారు.
పాల సేకరణ కేంద్రాల (Milk Collection Centers) విస్తరణ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రధాన ధ్యేయంగా పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. విజయ డెయిరీ ఉత్పత్తులు ఎల్లప్పుడూ నాణ్యతను పాటిస్తూ, మార్కెట్లో వాటి లభ్యతను విస్తృతం చేయడం ద్వారా వినియోగదారుల నమ్మకాన్ని చూరగొనాలని సూచించారు. పాడి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు, రాయితీలను అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
మహిళా సంఘాల ద్వారా పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ (Collector Bhavesh Mishra) అన్నారు. జిల్లా వ్యాప్తంగా పాడి పరిశ్రమ అభివృద్ధికి ఉన్న అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని పేర్కొన్నారు. విజయ డెయిరీని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన సహకారం అందిస్తామన్నారు. ప్రభుత్వ రంగ పాడి పరిశ్రమ అభివృద్ధి వల్ల పాడి రైతులు ఆర్థికంగా లాభం పొందడమే కాకుండా, ప్రజలకు మెరుగైన పాలు, పాల ఉత్పత్తులు అందుతాయని తెలిపారు. అనంతరం కలెక్టర్ కు విజయ డెయిరీ ఉత్పత్తులు సంస్థ అధికారులు అందించారు. ఈ సమావేశంలో విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్, డిస్ట్రిబ్యూటర్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Also: ప్లీజ్ ప్రధాని మోదీ.. ఈసారి తప్పు చేయొద్దు: రాహుల్ గాంధీ
Follow Us On: X(Twitter)

