కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా అన్నపు రెడ్డి పల్లి మండలం పెంట్ల గ్రామంలో అమలైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ అంకిత్ (Collector Ankit) బుధవారం సమగ్రంగా పరిశీలించారు. గ్రామంలో మొత్తం 46 ఇళ్లకు అనుమతులు మంజూరు కాగా, అందులో 13 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, మిగిలిన ఇళ్ల పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని సంబంధిత అధికారులు కలెక్టర్కు వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పెంట్ల గ్రామంలో తాటి లక్ష్మి అనే లబ్ధిదారు ఇంటిని ప్రత్యక్షంగా సందర్శించి నిర్మాణ నాణ్యత, పనుల పురోగతిని సవివరంగా పరిశీలించారు. లబ్ధిదారుతో నేరుగా మాట్లాడి ఇప్పటివరకు జరిగిన వ్యయం, ప్రభుత్వం నుండి విడుదలైన నిధులు వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ స్వర్ణ, ఎంపీడీవో మహాలక్ష్మి, ఎంపీఓ షబానా, అగ్రికల్చర్ ఆఫీసర్ అనూష తదితరులు పాల్గొన్నారు.

