కలం, మహబూబ్ నగర్ బ్యూరో: నారాయణపేట (Narayanpet) జిల్లాలో వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులపై గురువారం కలెక్టర్ ప్రియాంక, పునరావాసం భూసేకరణ కమిషనర్ శివ కుమార్ నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. భీమా ప్రాజెక్టుకు పెండింగ్లో ఉన్న భూసేకరణ పనులను తక్షణమే పూర్తి చేసి, ఇరిగేషన్ శాఖకు అప్పగించాలని అధికారులను ఆదేశించారు. కోయిల్సాగర్ ప్రాజెక్టు పెండింగ్ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అవసరమైన నిధుల మంజూరుకు ప్రభుత్వానికి వెంటనే ప్రతిపాదనలు పంపాలని చీఫ్ ఇంజనీర్కు కమిషనర్ సూచించారు. మక్తల్–నారాయణపేట–కొడంగల్ ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియలో ఏమైనా అడ్డంకిగా ఉంటే వాటిని భూ సేకరణ అధికారులకు తెలపాలని సూచించారు.
ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ..
జూరాల ప్రాజెక్టు పరిధిలోని అనుగొండ, అంకెన్పల్లి, దాదన్పల్లి పునరావాస కేంద్రాల భూసేకరణ, అభివృద్ధి పనుల పురోగతిని కూడా కలెక్టర్ ప్రియాంక, కమిషనర్ శివ కుమార్ నాయుడు సమీక్షించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలో ఇరిగేషన్ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా గుర్తించిందన్నారు. పెండింగ్ భూసేకరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. పునరావాస కేంద్రాల్లో రహదారులు, తాగునీరు, విద్యుత్తు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాలను కల్పించాలన్నారు. కలెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ.. భూసేకరణ, పునరావాస పనులను వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీను, భీమా ప్రాజెక్టు సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీధర్, కోయిల్సాగర్ డీఈఈ ప్రతాప్ సింగ్, ప్రత్యేక ఉప కలెక్టర్ (భూసేకరణ) ఎల్.రాజేందర్ గౌడ్, ఆర్డీవో రమేష్ తదితరులు పాల్గొన్నారు.

