కలం, వెబ్ డెస్క్: గుజరాత్ (Gujarat) తీరంలో మరోసారి భారీ స్థాయిలో డ్రగ్స్ను పట్టుకున్నారు. కచ్ ముంద్రా తీర ప్రాంతంలో ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి, సుమారు 115 కిలోల కొకైన్ స్వాధీనం చేసుకున్నాయి. వీటి విలువ రూ.1,150 కోట్లు ఉంటుందని అంచనా. కోస్ట్ గార్డ్ సమచారం ప్రకారం, ఈ డ్రగ్స్ తెస్తున్న ఎంవీ. యూరోప్ అనే నౌక బ్రెజిల్ నుంచి వస్తోంది. మార్గమధ్యలో పాకిస్థాన్లోని పోర్ట్ ఖాసీంలో కూడా కొన్ని గంటల పాటు లంగర్ వేసుకున్నట్లు తెలుస్తోంది. దిల్లీలోని కొందరు వ్యక్తులకు డ్రగ్స్ అందించేందుకు వీటిని తెస్తున్నట్లుగా గుర్తించి, అక్కడ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు టాంజానియాకు చెందినవారు. దీని వెనుక పెద్ద అంతర్జాతీయ నెట్వర్క్ ఉండి ఉంటుందని అనుమానిస్తున్నారు.
పక్కా నిఘా సమాచారంతో..
భారీగా కొకైన్ సరకుతో ఎంవీ. యూరోప్ నౌక భారత తీరం వైపు వస్తోందని మూడు రోజుల కిందటే కోస్ట్ గార్డ్ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం అందింది. దీంతో, కోస్ట్ గార్డ్ మెరైన్ కమాండోలు నౌకపై దాడి చేసి తనిఖీలు ప్రారంభించారు. దీంతో, అందులో సిబ్బంది అయిదు బ్యాగులను సముద్రంలోకి విసిరేయగా.. వాటిని వెలికి తీశారు. పరిశీలించగా కొకైన్ ఉన్నట్లు తేలింది. గత అయిదేళ్లలో గుజరాత్ ఏటీఎస్–కోస్ట్ గార్డ్ చేసిన అతి పెద్ద ఆపరేషన్లలో ఇది ఒకటిగా పేర్కొంటున్నారు.
Read Also: ఒకే ఫోన్లో ఎక్కువ UPI యాప్స్ వాడుతున్నారా? నిపుణుల హెచ్చరిక
Read Also: డిజిటల్ విప్లవం

