కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ వరుణ యాగం (Varuna Yagam) నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) నిర్ణయించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సూచనల మేరకు యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, వేద పండితులు, సిద్ధాంతి ఆగస్ట్ 10వ తేదీన వరుణ యాగానికి ముహూర్తంగా నిర్ణయించారు. నాగార్జునసాగర్ డ్యామ్ తీరంలోని విజయవిహార్ ప్రాంగణంలో ఈ యాగం చేపట్టనున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, వేద పండితులు, నిర్ణయించిన ముహూర్తం ప్రకారం యాగ క్రతువులు నిర్వహిస్తారు. అత్యంత వైభవోపేతంగా 108 మంది ఋత్వికులు, 11 హోమకుండాలు, వేదపండితులు, అర్చక బృందం సమక్షంలో మహా వరుణయాగం నిర్వహించబడుచున్నది. ఈ మహాయాగంలో సాయంత్రం 3.24 గంటలకు జరిగే పూర్ణాహుతి మహోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ విచ్చేసి పాల్గొననున్నారు.
కృష్ణా, గోదావరి నదులు, చెరువులు జలకళ సంతరించుకోవాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలన్న సంకల్పంతో ప్రత్యేక పూజలు చేస్తారు. రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సారథ్యంలో ఈ వరుణ యాగం నిర్వహించబడుతుంది. సాయంత్రం జరిగే మహత్తర పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొంటారు. ఈ మేరకు యాదగిరి గుట్ట దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ప్రకటన విడుదల చేశారు.
దేశం, రాష్ట్ర ప్రజల సర్వతోముఖ శ్రేయస్సు, సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, కృష్ణా–గోదావరి నదులు జలకళతో పరవళ్లు తొక్కాలని, నాగార్జునసాగర్తో పాటు రాష్ట్రంలోని అన్ని జలాశయాలు, చెరువులు సంపూర్ణంగా నిండాలని, ఎల్నినో ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై లేకుండా ఉండాలని ఆకాంక్షతో వరుణ యాగం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

