కలం, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదివారం ఖమ్మం, ములుగు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ఉదయం 10.45 గంటలకు బేగంపేట్ నుంచి హెలికాప్టర్లో ఖమ్మం (Khammam) బయలుదేరనున్నారు. సీఎం, 11.45 గంటలకు ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా నర్సింగ్ కాలేజీ, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్, జేఎన్టీయూ కాలేజీ, కూసుమంచిలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు.
మధ్యాహ్నం 2.30 గంటలకు ఖమ్మంలోని బీజేఎన్ఆర్ డిగ్రీ కాలేజీ మైదానంలో జరిగే సీపీఐ శతాబ్ది ఉత్సవాల బహిరంగ సభలో ముఖ్యమంత్రి (CM Revanth Reddy) పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం 4.30 గంటలకు ఖమ్మం నుంచి హెలికాప్టర్లో ములుగు జిల్లా మేడారానికి (Medaram) చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు మేడారంలోని హరిత హోటల్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు మేడారంలో చేపట్టిన అభివృద్ధి పనులను సీఎం పరిశీలించనున్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి హరిత వై జంక్షన్, జంపన్న వాగు స్తూపం వరకు, అలాగే మేడారం ఆర్టీసీ బస్ స్టాండ్ను సందర్శించనున్నారు. రాత్రి 7 గంటలకు మేడారం ఆలయ ఎగ్జిట్ సెంటర్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం రాత్రి మేడారం హరిత హోటల్లో సీఎం బస చేయనున్నారు.
సోమవారం కార్యక్రమాలు
సోమవారం ఉదయం 6.30 గంటలకు మేడారంలోని సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణంలో నిర్మించిన పైలాన్ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం వన దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
Read Also: ముస్తాబైన మేడారం.. డ్రోన్ విజువల్స్, ఫొటోలు
Follow Us On : WhatsApp


