కలం, వరంగల్ బ్యూరో : ఈ నెల 8న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం జిల్లా పర్యటనలో భాగంగా రేగొండ మండలంలోని కొడవటంచ ఆలయాన్ని సందర్శించి ఆలయ నిర్మాణ పనులను పరిశీలిస్తారు. అనంతరం చెల్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహించే సభలో సీఎం (CM Revanth Reddy) పాల్గొంటారు. ఈ మేరకు కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి ఎస్పీ సంకీర్త్ సభ ఏర్పాట్లు పరిశీలించారు. కొడవటంచ ఆలయంలో జరుగుతున్న నిర్మాణ పనులు, హెలిప్యాడ్, రోడ్డు ఏర్పాట్లను పరిశీలించారు.
భూపాలపల్లి పట్టణంలోని మంజూరు నగర్లో ఏర్పాటు చేయనున్న సభా ప్రాంగణ స్థలం, హెలిప్యాడ్, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు తగు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.


