epaper
Wednesday, March 4, 2026
epaper

ఈ నెల 14న హుజూర్‌నగర్‌కు సీఎం రేవంత్

కలం, నల్లగొండ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ నెల 14న హుజూర్‌నగర్ (Huzur Nagar) నియోజకవర్గంలో పర్యటించనున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను బుధవారం స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో పర్యటన వివరాలను వెల్లడించారు. హుజూర్‌నగర్‌లోని రామస్వామి గుట్ట వద్ద అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన మోడల్ హౌసింగ్ కాలనీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్టు తెలిపారు. మొత్తం 2,160 ఇండ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకోగా, మొదటి దశలో పూర్తయిన వెయ్యి ఇండ్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు.

లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండదని, పూర్తిగా పారదర్శకంగా అర్హులను ఎంపిక చేసినట్లు మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. గృహప్రవేశం చేసిన అనంతరం ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు కాలనీలోని లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేయనున్నారు. సామాన్య ప్రజలకు అండగా ఉంటామనే సందేశాన్ని ఇచ్చేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కాలనీ ప్రారంభోత్సవం అనంతరం హుజూర్‌నగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

ఈ సభకు నియోజకవర్గ నలుమూలల నుంచి వేలాదిగా ప్రజలు తరలివచ్చేలా కాంగ్రెస్ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. హుజూర్‌నగర్ అభివృద్ధిలో ఇదొక మైలురాయి. పేదలకు సొంత ఇంటి కల నెరవేర్చడమే కాకుండా వారికి అన్ని వసతులతో కూడిన మోడల్ కాలనీని అందిస్తున్నామని తెలిపారు. సీఎం రాకను పురస్కరించుకుని అధికారులు భారీ భద్రత, ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!