కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం మావోయిస్టులు లొంగిపోయిందుకు సానుకూల వాతావరణం కల్పిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పేర్కొన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థికభరోసా, ఆరోగ్యభద్రత కల్పిస్తామని చెప్పారు. గతంలో సెంట్రల్ కమిటీ మెంబర్లతో తాను గతంలో చర్చలు జరిపానని చెప్పారు. రాష్ట్ర పరిధిలో ఉన్నసమస్యలు మొత్తం పరిష్కారం చేస్తామని మావోయిస్టు అగ్రనేతలకు హామీ ఇచ్చినట్టు చెప్పారు. 130 మంది మావోయిస్టులు శనివారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. హింసతో సమస్యలకు పరిష్కారం దొరకదని రేవంత్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఎక్కడైనా శాంతియుత మార్గం ద్వారానే పోరాటాలు సాగాయని గుర్తు చేశారు.
‘మావోయిస్టులకు మెరుగైన వైద్యం అందజేస్తాం. సెంట్రల్ కమిటీ, స్టేట్ కమిటీలో ఉన్న నేతలకు రివార్డులు ఇస్తున్నామని చెప్పారు. నగదు, వసతి కల్పిస్తాం. హింసకు తెలంగాణలో తావు లేదు. మావోయిస్టులు హింసకు పాల్పడినా.. తమ దగ్గర ఆయుధాలు ఉంచుకున్నా కఠినంగా వ్యవహరిస్తాం.’ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ‘డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీ సుమతి, అదనపు డీజీ విజయ్ కుమార్, వివిధ హోదాల్లోని పోలీసు అధికారులు కృషి చేసి నక్సలైట్లకు నమ్మకాన్ని కలిగించారు. జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులకు ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుంది… ఈ నమ్మకాన్ని కలిగించి ఒకేసారి 130 మంది సరెండర్ అయ్యేలా కృషి చేసినవారిని అభినందిస్తున్నాను.’ అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
‘శాంతియుత మార్గాల ద్వారానే పరిష్కారం దొరుకుతుందని నమ్మే దేశం ఇది. రవి అస్తమించని సామ్రాజ్యం ఉన్న బ్రిటీషువారికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ శాంతియుతంగానే పోరాడి యుద్ధాన్ని గెలిచి దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చారు. హింసతో, సాయుధ పోరాటాలతో స్వాతంత్ర్యం వస్తుందని, సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తున్న తరుణంలో శాంతియుత మార్గంలో ఎలా ఫలితాలను సాధించాలో గాంధీ నిరూపించారు. దేశాల మధ్య యుద్ధాలను ఆపాలనుకున్నప్పుడు కూడా ఆ దేశాల మధ్య చర్చలు జరిపి శాంతియుత పద్ధతులు అమలుకావడం చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం తరఫున మిగిలినపోయిన మావోయిస్టులంతా అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలోకి రావాలి. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి’ అంటూ రేవంత్ పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం ఉన్నదే ప్రజల సమస్యలను తీర్చడానికని చెప్పారు. మావోయిస్టులు లేవనెత్తే అంశాలను సానుకూలంగా పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ‘దేవ్జీ, మల్లా రాజిరెడ్డి, దామోదర్.. వీరితో సుదీర్ఘంగా చర్చలు జరిపి ఆలోచనలను, ఆవేదనలను అర్థం చేసుకున్నాం. అజ్ఞాతవాసంలో జీవిస్తున్నవారిపట్ల సానుకూలంగా స్పందించి ప్రాణాలకు హాని జరగకుండా వారి సమస్యలను ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించడానికి వీలైతే తప్పకుండా పాటిస్తాం’ అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

