కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దృష్టి పెట్టారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో మూడు కార్పొరేషన్ల కమిషనర్లు, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి, కీలక ఆదేశాలు జారీ చేశారు. మూసీ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యంగా చేపట్టాలని, భూసేకరణ పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. అసైన్డ్ భూముల సేకరణలో మరింత జాగ్రత్తలు అవసరమని.. ల్యాండ్ పూలింగ్పై స్పష్టమైన విధానం రూపొందించుకోవాలన్నారు. నది ఎఫ్టీఎల్, బఫర్ జోన్ గుర్తింపులో నిర్లక్ష్యం వద్దన్నారు.
రెండో దశకు త్వరలోనే టెండర్లు..
మూసీ ప్రాజెక్ట్ రెండో దశ నిర్మాణానికి అవసరమైన టెండర్లను వీలైనంత త్వరగా నిర్వహించాలని సీఎం రేవవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రాజెక్టులకు అతి తక్కువ వడ్డీలకు రుణాలు ఇచ్చే ఆర్థిక సంస్థలపై హైదరాబాద్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్లు దృష్టి పెట్టాలన్నారు. అంతేగాకుండా, ప్రాజెక్టులో నిర్మాణాలు కోల్పోతున్నవారికి అందించే టీడీఆర్ బాండ్లపైనా ప్రతి వారం సమీక్షించాలన్నారు. మంచిరేవుల ఓంకారేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి అవసరమైన టెండర్లను తక్షణమే పిలవాలని సూచించారు. కొత్వాల్గూడ పక్షుల పార్కుకు మరింత ప్రాచుర్యం కల్పించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

