Mobile Popup Ad
Mobile Popup Ad

వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలి: సీఎం రేవంత్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్ : వర్షా కాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన సెక్రటేరియట్ లో సమీక్ష జరిగింది. ఈ సమీక్షకు వ్యవసాయ, నీటి పారుదల, పట్టణాభివృద్ది, పంచాయతీ రాజ్, ఆరోగ్య, హోమ్, హైడ్రా, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖ, వాతావరణ శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నైరుతి రుతుపవనాలతో వచ్చే వర్షపాతం.. ఎల్ నినో ప్రభావం, ఇతర అంశాలపై వాతావరణ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ఈ మేరకు పంట మార్పిడి.. పంటల వైవిధ్యత ప్రాధాన్యాన్ని అన్నదాతలకు తెలియజేయాలని సీఎం అన్నారు. తక్కువ నీరు వినియోగించుకునే పంటలపై రైతులకు వివరించాలని తెలిపారు. ఈ క్రమంలోనే ప్రాజెక్టుల మెయింటెనెన్స్ పనులపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. గేట్లు… నిర్వహణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ప్రాజెక్టుల మెయింటెనెన్స్ కు అవసరమైన నిధులు తక్షణమే విడుదల చేయాలన్నారు.

విపత్తు నిర్వహణకు రూ.1000 కోట్లు

రాబోయే వానాకాలంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా తట్టుకునేలా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ అన్నారు. విపత్తు నిర్వహణ శాఖ వద్ద ఉన్న రూ.1000 కోట్లను నిబంధనల ప్రకారం తక్షణ అవసరాల కోసం వినియోగించాలని చెప్పారు. విపత్తుల సమయంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం వాటిల్లినప్పుడు తక్షణమే అధికారులు స్పందించాలని తెలిపారు. దెబ్బతిన్న రోడ్లు, కూలిపోయిన వంతెనల నిర్మాణానికి అవసరమైన నిధులు వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఆ యూరియా మొత్తం తెలంగాణకే..

మరోవైపు రామగుండం ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి అయ్యే యురియా మొత్తం తెలంగాణకే కేటాయించాలని కేంద్రానికి లేఖ రాస్తామని చెప్పారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, ఎస్పీ సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. నిర్ణీత సమయంలో భేటీ అవుతూ ప్రజా సమస్యలు పరిష్కరించాలన్న సీఎం… క్యూర్ పరిధిలో మూడు కార్పొరేషన్ల కమిషనర్లు, పోలీస్ కమిషనర్లు సమన్వయంతో ముందుకు సాగాలని తెలియజేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>