కలం, వెబ్ డెస్క్: ప్రతి జిల్లా కేంద్రానికి ఓ రింగ్ రోడ్డు ఏర్పాటు చేసేలా.. ఆ రింగ్ రోడ్డును హైవేకు అనుసంధానించే అంశాన్ని అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రోడ్ సెక్టార్ పాలసీ-2047కి అనుగుణంగా రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ నగరం నుంచి రాష్ట్రంలో ఎక్కడికైనా నిర్ణీత సమయంలో చేరుకునేలా రోడ్ల అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దండి
హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దడానికి కనెక్టివిటీ రోడ్ల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను గుర్తించాలంటూ రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులకు సూచించారు. ఇప్పటికే గుర్తించిన ఏరియాలలో రోడ్ల అభివృద్ధి పనులు మొదలు పెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యలు తలెత్తకుండా జీహెచ్ఎంసీ, రెవెన్యూ విభాగాలతో సమీక్ష నిర్వహించి స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లాలని కోరారు. ‘టీచింగ్ హాస్పిటల్స్, పెద్ద ఆసుపత్రుల నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తిచేయాల్సిందే. పేదలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా హాస్పిటల్స్ భవనాల నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి.’ అంటూ రేవంత్ రెడ్డి ఆదేశించారు.

