కలం, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. రాష్ట్ర రహదారుల అంశాలపై కూలంకషంగా చర్చించారు.
ఫ్యూచర్ సిటీ – బందర్ గ్రీన్ఫీల్డ్ హై వే..
సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రీజినల్ రింగు రోడ్డు (ట్రిపుల్ ఆర్) ఉత్తర భాగానికి సంబంధించి ఇప్పటికే 95 శాతం భూసేకరణ పూర్తయినందున పనుల ప్రారంభానికి కేంద్ర క్యాబినెట్ అనుమతి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగానికి అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ఏకకాలంలో పనులు ప్రారంభమైతే నిర్మాణం త్వరగా పూర్తవుందుని, నిర్మాణ వ్యయం తగ్గుతుందని తెలిపారు.
బందరు పోర్టుకు కొత్త హైవే ఇవ్వండి..
హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానికి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మిస్తామని ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్నందున వెంటనే అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టుకు 12 వరుసల రహదారి మంజూరు చేస్తే హైదరాబాద్-విజయవాడల మధ్య 100 కి.మీ. దూరం తగ్గుతుందన్నారు. సరకు రవాణా కూడా వేగవంతమవుతుందని సీఎం వివరించారు.
మంచిర్యాల – హైదరాబాద్ రహదారిపై సమీక్ష..
హైదరాబాద్ – మంచిర్యాల రాజీవ్ రహదారికి ప్రత్యామ్నాయంగా మంచిర్యాల – హైదరాబాద్ ఆరు వరుసల ప్రత్యామ్నాయ రహదారికి అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైన భూ సేకరణను తాము చేపడతామని స్పష్టం చేశారు. మన్ననూరు-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్కు సంబంధించి అటవీ శాఖ అనుమతులు ఇప్పించేందుకు కృషి చేయాలని కోరారు. నల్లమల అభయారణ్యం, శ్రీశైలం ఆలయం, శ్రీశైలం జలాశయాలు ఈ కారిడార్ పరిధిలో ఉంటాయని సీఎం తెలిపారు.

