కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రేపు ఖమ్మం జిల్లా మధిరలో పాల్గొనాల్సిన రైతు ఆశీర్వాద సభ రద్దయింది. రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు గాను ఈ కార్యక్రమం నిర్వహించాలని ముందే నిర్ణయించి ఏర్పాట్లు చేశారు. అయితే, భారీ వర్షాల కారణంగా సభా ప్రాంగణం మొత్తం బురదమయంగా మారిపోయింది. రేపు కూడా వర్షాలు పడే అవకాశం ఉండటంతో.. సభ రద్దు చేయాలని ముఖ్యమంత్రి భావించారు. రేపు సాయంత్రం 4 గంటలకు శిల్పాకళా వేదికలో రైతు భరోసా నిధులను విడుదల చేయబోతున్నారు. సభ పేరును ‘రైతు భరోసా పంపిణీ సదస్సు’గా సూచిస్తూ వెంటనే ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
వర్చువల్గా రైతులు పాల్గొనేలా..
మధిర సభ రద్దయినా.. రేపు సాయంత్రం జరిగే రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల రైతులు రైతు వేదికల ద్వారా వర్చువల్ పద్ధతిలో హాజరయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సీఎం సభ రద్దు కావడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరుత్సాహపడుతున్నారు. ఈ సభ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గత 15 రోజులుగా దగ్గరుండి మరీ ఏర్పాట్లు చేస్తున్నారు. లక్ష మందికి పైగా రైతులు హాజరు కాబోతున్నారని ప్రకటించారు. కానీ, వర్షాల కారణంగా సభ రద్దయిపోయింది.

