కలం, వెబ్ డెస్క్ : మహిళల ఆశీర్వాదం వల్లే ముఖ్యమంత్రిగా ఎదిగినట్లు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) అన్నారు. కొడంగల్ కిందపడ్డ తనను మల్కాజ్ గిరిలో గెలిపించారని ఆయన గుర్తు చేశారు. ఆదివారం ఉప్పల్ భగాయత్ లే అవుట్ తో పాటు రూ.1511 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. అలాగే, 10 ఎకరాల్లో రూ.98 కోట్లతో నిర్మించే మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనానికి భూమి పూజ చేశారు. క్యూర్ వన్ యాప్ ను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ ప్రసంగించారు. ఐదేళ్లు తిరిగినా మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గం పూర్తి కాదని.. మల్కాజ్ గిరి పార్లమెంట్ అంటే మినీ భారత దేశం అని సీఎం చెప్పారు.
కిందపడిపోయిన తనను మల్కాజ్ గిరి ప్రజలు ఆశ్వీరదించారని గుర్తు చేసుకున్నారు. ఈ ప్రాంత ఎంపీ కావడం వల్లే పీసీసీ అధ్యక్షుడిగా సోనియా గాంధీ నియమించారని చెప్పుకొచ్చారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడటానికి.. తాను ముఖ్యమంత్రి కావడానికి కారణం మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానం అని చెప్పారు. గత ప్రభుత్వం సహకారం లేకపోవడం వల్లే మల్కాజ్ గిరి పార్లమెంటులో అభివృద్ధి సరిగా చేయలేకపోయానని తెలిపారు. హైదరాబాద్ లో శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో అభివృద్ధి సరిగా జరగలేదన్నారు. అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయల కల్పన కోసం విజన్ డాక్యూమెంట్ ను తీసుకువచ్చామని రేవంత్ వెల్లడించారు.
తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో విజన్ డాక్యుమెంటును తీసుకువచ్చి క్రమపద్దతిలో అభివృద్ధి చేయబోతున్నట్లు తెలిపారు. మౌలిక సదుపాయలు, పరిపాలన సమన్వయం, మూసీ ప్రక్షాళన వంటివి జరగాలంటే ప్రక్షాళన అవసరం అని భావించినట్లు రేవంత్ వెల్లడించారు. క్యూర్ ప్రాంతాన్ని ఏర్పాటు చేసి మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం మాత్రమే మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా మల్కాజ్ గిరి పార్లమెంట్ ప్రాంతానికి నిధులు మంజూరు చేస్తానని సీఎం (CM Revanth reddy) హామీనిచ్చారు.

