కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు దాటిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాలనపై మరింత దృష్టి సారిస్తున్నారు. స్థానిక, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు అందించిన విజయాలను పరిగణనలోకి తీసుకుంటూ సంక్షేమ పథకాల అమలు (Welfare Scheme Implementation)పై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన సమావేశంలో అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. నిజమైన అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
గ్రామ సభల్లో సంక్షేమ పథకాల వారీగా ప్రభుత్వం చేకూరుస్తున్న లబ్ధిని ప్రజలకు వివరించాలని, ప్రజా ప్రభుత్వంలో అందిస్తున్న రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లబ్ధిదారుల అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. విద్యా వ్యవస్థలో ప్రజా ప్రభుత్వం తీసుకువస్తున్న మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్టం చేసేందుకు సమీపంలోని మెడికల్ కాలేజీలకు అనుసంధానం చేయాలని, తద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందిచేలా చర్యలు తీసుకోవాలని రేవంత్ తెలిపారు.
అలాగే మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు ప్రతి నెలా బిల్లుల చెల్లింపులు కచ్చితంగా అందేలా చర్యలు చేపట్టాలన్నారు. 99 డేస్ ప్రోగ్రాంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా వరకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండాలని సీఎం రేవంత్ సూచించారు.

