అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నా.. సీఎం రేవంత్ ట్వీట్

కలం, వెబ్ డెస్క్ : మరికాసేపట్లో రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతుభరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. సిద్ధిపేట జిల్లా నర్మెటలో ఇవాళ సాయంత్రం 4గంటలకు జరిగే సభా వేదిక నుంచి ఈ నిధులను సీఎం రీలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సోషల్‌ మీడియాలో కీలక పోస్ట్ చేశారు.

”అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నా. రైతును ధైర్యంగా సాగు మడిలో నిలబెట్టేందుకు భరోసా ఇస్తున్నా. 70 లక్షల మంది రైతన్నల కోసం రూ.9000 కోట్ల రైతు భరోసా నిధుల విడుదలకు నేడు శ్రీకారం చుడుతున్నాం. సిద్ధిపేట జిల్లా నర్మెట గ్రామ వేదికగా మరోసారి మా పాలనలో రైతే రాజు అని రుజువు చేస్తూ పథకాన్ని అమలు చేస్తున్నాం. ఆర్ధిక సాయంతో చేతులు దులుపుకోవడం కాదు… కేవలం 17 నెలల వ్యవధిలో పామ్ ఆయిల్ పరిశ్రమ మొదలు పెట్టి, పూర్తి చేసి నేడు రైతు లోకానికి అంకితం చేస్తున్నాం. దానికి కొనసాగింపుగా రిఫైనరీ యూనిట్ కు శంకుస్థాపన చేస్తున్నాం” అని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

కాగా, రైతు భరోసా పథకం కింద 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందించేందుకు రూ.9 వేల కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం సమకూర్చుకుంది.సిద్దిపేట జిల్లా నర్మెటలో సాయంత్రం 4గంటలకు జరిగే సభలో డిప్యూటీ సీఎం భట్టి, వ్యవసాయ మంత్రి తుమ్మల, ఇతర మంత్రుల సమక్షంలో సీఎం వీటిని విడుదల చేస్తారు. తెలంగాణలో మొత్తం 73 లక్షల మంది రైతులున్నారు. వీరందరికీ ఒక ఎకరం వరకు సాయం అందేలా రూ.3,590 కోట్లు ఆదివారం ఆర్బీఐ ద్వారా బ్యాంకులకు అటు నుంచి రైతులకు వెళ్తాయి. ఆదివారం సెలవు కావడంతో సోమవారం అన్నదాతల ఖాతాల్లో జమవుతాయి. ఇరవై రోజుల అనంతరం రెండో విడతలో రూ.2,650 కోట్లు, మూడో విడతలో రూ.2,760 కోట్లు విడుదల చేస్తారు. ఇదిలాఉంటే రాష్ట్రంలోని మొత్తం రైతుల్లో 24.32 లక్షల మందికి ఎకరం వరకు, 48.68 లక్షల మందికి ఎకరం కంటే ఎక్కువ వ్యవసాయ భూములు ఉన్నాయి.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>