కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోమవారం ఉదయం మంత్రులతో అత్యవసరంగా జూమ్ మీటింగ్ (Zoom Meet) నిర్వహించారు. నేటితో మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) ప్రచారం ముగియనున్న నేపథ్యంలో సీఎం కీలక అంశాలు చర్చించనున్నట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే 90కి పైగా స్థానాల్లో గెలిచి తీరాలని సీఎం రేవంత్ మంత్రులకు సూచించారు. అలాగే స్థానికంగా ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమన్వయం చేసుకుంటూ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని కూడా చెప్పారు. అయితే ప్రస్తుతం ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిస్థితిపై ఎలా ఉందన్న దానిపై సీఎం రేవంత్ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రచార తీరు, ప్రజల స్పందన, పార్టీకి ఎలాంటి ఫలితాలు రావొచ్చన్న దానిపై మంత్రులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు.


