కలం, వెబ్ డెస్క్ : ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్లపై సీఎం.. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి కొనుగోళ్ల తీరును పరిశీలించాలన్నారు. గన్ని బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చూసుకోవాలని.. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోడౌన్స్ కు తరలించాలన్నారు.
ధాన్యం లోడ్ తరలించేందుకు ఒప్పందం మేరకు సరిపడా లారీలను అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లను ఉపేక్షించకూడదని.. అవసరమైతే అలాంటి వారిపై క్రిమినల్ కేసులకూ వెనకాడొద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారుకు సూచించారు. ధాన్యం తరలింపునకు అవసరమైన వాహనాలను అందుబాటులో ఉండేలా చూడాలని రవాణా శాఖ కమిషనర్ కు ఆయన ఆదేశించారు. సమస్య తీవ్రతను గుర్తించి సరైన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రతీ అధికారి జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిందేనని.. నిర్లక్ష్యం వహిస్తే కలెక్టర్లపై చర్యలకు కూడా ప్రభుత్వం వెనకాడదని సీఎం హెచ్చరించారు.
గోడౌన్స్ సమస్య ఉన్న ప్రాంతాల్లో అవసరాన్నిబట్టి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రైతుబజార్లు, ఫంక్షన్ హాల్స్ ను అనుసంధానం చేసుకుంటూ ధాన్యాన్ని తరలించాలన్నారు. వెసులుబాటు ఆధారంగా అక్కడినుంచి గోడౌన్స్ కు తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సీఎం చెప్పారు. మొక్కజొన్న పంట ఎక్కువగా వచ్చే జిల్లాల కలెక్టర్లు కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా.. అవసరమైన చోట పోలీస్ సహాయం తీసుకుని ధాన్యం సేకరణ సాఫీగా జరిగేలా చూడాలన్నారు. కొనుగోళ్లపై ఎప్పటికప్పుడు సీఎస్ కు రిపోర్ట్ పంపించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

