కలం, వెబ్ డెస్క్: మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ (Redya Naik)కు తృటిలో ప్రమాదం తప్పింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం శివారులోని రైస్మిల్లుకు వెళ్లే రోడ్డు వద్ద రెడ్యా నాయక్ ప్రయాణిస్తున్న కారు గురువారం ప్రమాదానికి గురైంది. ముందుగా వెళ్తున్న ఓ ద్విచక్రవాహనం అకస్మాత్తుగా యూటర్న్ తీసుకోవడంతో, ఎదురుగా వస్తున్న కూలీలను తప్పించేందుకు మాజీ ఎమ్మెల్యే కారు డ్రైవర్ వాహనాన్ని నెమ్మదిగా నడిపారు.
ఇదే సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న మరో కారు మాజీ ఎమ్మెల్యే కారు వెనుక భాగాన్ని ఢీకొట్టింది. దీంతో కారు వెనుక భాగం దెబ్బతింది. ప్రమాద సమాచారం తెలుసుకున్న అబ్బాయిపాలెం, ధారావత్ తండా గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకుని మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ను పరామర్శించారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

