కలం, డెస్క్ : పోటీ పరీక్షల పేపర్లను జిరాక్స్ సెంటర్లలో బీఆర్ ఎస్ అమ్మిందని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. గ్రూప్-1, 2 ఆఫీసర్ల శిక్షణ ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ ప్రాంత ప్రజలు ఆకలితో అయినా ఉంటారు గానీ.. ఆత్మగౌరవాన్ని వదులుకోరు. ఆధిపత్యాన్ని సహించరు. ఈ ప్రాంత పోరాట యోధుల స్ఫూర్తితో మీరు ఉద్యోగాలు సాధించారు. కానీ మిమ్మల్ని బీఆర్ఎస్ (BRS) అత్యంత దారుణంగా అవమానించింది. మీరంతా కోట్లు పెట్టి ఉద్యోగాలు కొనుక్కున్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం అమ్ముకున్నది అంటూ తప్పుడు ప్రచారాలు చేశారు. కానీ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలను మీరంతా తిప్పికొట్టడం నాకు సంతోషాన్ని ఇచ్చింది. మీకు ఉద్యోగాలు వచ్చిన సంతోషాన్ని బీఆర్ఎస్ నేతలు ఒక్కరోజు కూడా ఉండనివ్వలేదు. అయినా మీరు పోరాడిన తీరు స్ఫూర్తి దాయకమైనది’ అంటూ చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.
బీఆర్ఎస్ పదేళ్లు పాలించింది గానీ ఒక్క గ్రూప్-1 ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు సీఎం రేవంత్ (Revanth Reddy). కేసీఆర్ పాలనలో పోటీ పరీక్షల ఎగ్జామ్స్ పేపర్లను (Exam Papers) జిరాక్స్ సెంటర్లలో అమ్మి.. విచ్చలవిడిగా వ్యవహరించారని సీఎం రేవంత్ విమర్శించారు. ‘మా ప్రభుత్వ హయాంలో పోటీ పరీక్షలు అన్నీ పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. ఒక్క పేపర్ కూడా లీక్ కావట్లేదు. ఒక్క ఉద్యోగం కూడా అమ్మకానికి పెట్టట్లేదు. కష్టపడి చదువుకున్న వారే ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఉద్యోగంలో జాయిన్ అయ్యాక ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాలి. ఎలాంటి రాజకీయ ఒత్తిడిలకు లొంగొద్దు. ప్రతి పని విద్యార్థిగా మారి నేర్చుకోవాలి. నేను కూడా రీసెంట్ గానే హార్వర్డ్ యూనివర్సిటీకి (Harvard University) వెళ్లి క్లాసులు తీసుకున్నాను. మీరందరూ హార్వర్డ్ వెళ్లడం కుదరదు కాబట్టి.. వాళ్లనే ఇక్కడకు తీసుకొస్తున్నాం. ఇందుకోసం ఎంసీఈ హెచ్ ఆర్డీ, హార్వర్డ్ మధ్య ఎంవోయూ చేస్తున్నాం. కాబట్టి హార్వర్డ్ వాళ్లే ఇక్కడకు వచ్చి మీకు క్లాసులు ఇస్తుంటారు’ అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
Read Also : రెవెన్యూ శాఖ అవినీతిలో కూరుకుపోయింది: హరీశ్ రావు
Follow Us On: Instagram

