కలం, నల్లగొండ బ్యూరో : రేవంత్ రెడ్డి స్థాయి పెరిగినా అవే బూతులు మాట్లాడుతున్నాడని సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి స్థాయి లేకున్నా ముఖ్యమంత్రి పదవి అధిష్టించాక కొంచెమైనా విజ్ఞత నేర్చుకోవాల్సి ఉండేదన్నారు. సీఎంగా రెండేళ్లు అయినప్పటికీ రోజురోజుకు సంస్కార హీనత పెరిగిపోతుందన్నారు.
మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల (Miryalaguda Municipal Elections) ప్రచారంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ శంకుస్థాపనలు చేయడం ఏమిటని నిలదీశారు. సీఎం స్వయంగా ఎన్నికల సంఘం నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించడం అనైతిక చర్యని, ముఖ్యమంత్రి వస్తే జిల్లాకు ఏదో ప్రకటిస్తారని ప్రజలు ఆశించారని, కానీ నయా పైసా ప్రయోజనం లేకుండా పోయిందని వివరించారు. హార్వర్డ్ వర్సిటీకి వెళ్లి జ్ఞానం తెచ్చుకుంటాడనుకుని భావిస్తే.. రేవంత్ రెడ్డి ఉన్న జ్ఞానం పోగొట్టుకున్నాడని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత తెలంగాణ ఉద్యమంలో లేని రేవంత్ రెడ్డికి లేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి భాషను ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని, ఉన్న సమస్యలను పక్కనపెట్టి ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. అందుకే కేసీఆర్ పైన విమర్శలు, కేసుల విచారణల పేరుతో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాడని జగదీష్ రెడ్డి (Jagadish Reddy) విమర్శించారు. సూర్యాపేట మున్సిపాలిటీలో మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Read Also: ఐసీసీ నిర్ణయాలపై నాసర్ హుస్సేన్ తీవ్ర వ్యాఖ్యలు
Follow Us On: Pinterest


