కలం, నిర్మల్: వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఏఎన్ఎంల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం నిర్మల్ (Nirmal) జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి సురేశ్ మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్య శాఖలో సేవలందిస్తున్న రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్నారు. అలాగే గత మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న 1,931 ఏపీఎచ్ఏ ఫిమేల్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి ఏఎన్ఎంల సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్ పోస్టులను భర్తీ చేసి ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి, రాధా, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.

