కలం, వెబ్ డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం పెద్ది (Peddi). ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. పెద్ది సినిమా ట్రైలర్ను చూసిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ ట్రైలర్ అద్భుతంగా ఉందని మూవీ టీంపై ప్రశంసల వర్షం కురిపించారు. దాదాపు 3 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ పూర్తిగా ఫైర్ పవర్తో నిండిపోయిందని కొనియాడారు. హీరో రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్.. ఈ ముగ్గురూ తమ అత్యుత్తమ ప్రతిభను కనబరిచారని, అందరూ కలిసి ట్రైలర్ను రఫ్ఫాడించేశారంటూ మెగాస్టార్ ప్రశంసించారు. మనం ఎంత ఊహించుకున్నా, ఈ ట్రైలర్ అంతకు మించి నెక్స్ట్ లెవెల్ ఎమోషన్, ఎలివేషన్, మ్యాడ్నెస్ తో ఉందంటూ చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ అభిమానులను మరోసారి చిరు లీక్స్తో సర్ప్రైజ్ చేశారు. ట్రైలర్లోని ఒక పవర్ఫుల్ డైలాగ్ను చిరంజీవి ముందే లీక్ చేశారు. మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు.. నేను పోరాడాను సారు.. అంటూ చరణ్ చెప్పే ఇంటెన్స్ డైలాగ్ను ఆయన పోస్టులో రాసుకొచ్చారు. ట్రైలర్ చూసిన తర్వాత కలిగిన ఎగ్జైట్మెంట్తో కంట్రోల్ తప్పి ఈ డైలాగ్ లీక్ చేయాల్సి వచ్చిందని, ఇందుకు నొచ్చుకోవద్దంటూ డైరెక్టర్ బుచ్చిబాబుకు చిరంజీవి సరదాగా సారీ చెప్పారు. ఇక మెగాస్టార్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండగా, పెద్ది సినిమాపై మెగా అభిమానుల అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి..

