కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో చికెన్ షాపులు (Chicken Shops) మూతపడుతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా షాపులను మూసేయాలని రిటైల్ అసోసియేషన్ ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో హైదరాబాదులో ఇప్పటికే కొన్ని షాపులు క్లోజ్ అయ్యాయి. మిగతా షాపులు బుధవారం నుంచి బంద్ కానున్నాయి. మార్జిన్ ఇవ్వడంలో పౌల్ట్రీ కంపెనీలు దౌర్జన్యానికి దిగుతున్నాయని, అందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రిటైలర్ అసోసియేషన్ (Retailer Association) తెలిపింది. మార్జిన్ విషయంలో చాలాకాలంగా పౌల్ట్రీ కంపెనీలతో చర్చలు జరుపుతున్నా.. ఎలాంటి క్లారిటీ రావడంలేదని, పైగా ప్రస్తుతం వస్తున్న మార్జిన్ ను కూడా భారీగా తగ్గించాయని రిటైలర్ అసోసియేషన్ పేర్కొంది. ఒక్కో షాపు నడుపుకోవడానికి హైదరాబాద్ వంటి ఏరియాలో నెలకు ఎంత లేదన్న షాప్ కిరాయి, వర్కర్స్ కు శాలరీలు వంటివి కలుపుకొని రూ. లక్ష ఇరవై వేల వరకు అవుతుందని చికెన్ షాప్ ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మార్జిన్ లో కోతలు పెట్టడంతో తమకు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రావడం లేదని, పైగా అప్పులు చేయాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో పౌల్ట్రీ కంపెనీలు స్పందించకపోతే తమ భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పౌల్ట్రీ రిటైలర్ అసోసియేషన్ హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వం తమ విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలని అసోసియేషన్ కోరుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధ ప్రభావంతో ఇప్పటికే తాము కష్టాలను ఎదుర్కొంటున్నామని, దీనికి తోడు పౌల్ట్రీ కంపెనీల తీరు తమను రోడ్డు పాలు చేస్తున్నదని చికెన్ షాప్ (Chicken Shops) నిర్వాహకులు వాపోతున్నారు. కాగా, నాలుగు రోజుల క్రితం వరకు మార్కెట్లో కిలో స్కిన్ లెస్ చికెన్ రూ.360 ఉండగా మంగళవారం రూ.250కి దిగి వచ్చింది. రేటు తగ్గినప్పటికీ షాపులు ఓపెన్ లేకపోవడంతో చికెన్ ప్రియులకు నిరాశే ఎదురవుతోంది.
Read Also: ఇంటి నుంచే ఓటు హక్కు: మూడు రాష్ట్రాల్లో ప్రారంభం
Follow Us On : WhatsApp

