కలం, నల్లగొండ బ్యూరో : నల్లగొండ (Nalgonda) జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం చెరువు గట్టు (Cheruvugattu Temple) శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి క్షేత్రం భక్తుల పాలిట అగ్నిగుండంగా మారింది. ఎండలు మండిపోతున్నా.. భక్తులకు కనీస సౌకర్యాలను అందించడంలో దేవస్థాన అధికారులు, పాలకమండలి ఘోరంగా విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్న వేళ కొండపై రాళ్లు నిప్పుల కొలిమిలా మారాయి. అయినప్పటికీ ఆలయ పరిసరాలలో కోకో కార్పెట్లు, చలువ పందిళ్లు, తాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేయకపోవడం పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు మెట్లపై నడవలేక ఇబ్బందులు పడుతున్నారు.
స్వామివారి దర్శనానికి వెళ్లే మూడు గుండ్ల మార్గం మరింత కష్టసాధ్యంగా మారింది. ఎండలో నడవడం భక్తులకు కష్టంగా ఉండగా, దిగే మార్గంలో ఇనుప మెట్లు వేడెక్కిపోవడంతో కాలు పెట్టలేని పరిస్థితి నెలకొంది. కొన్నేళ్ల క్రితం ఏర్పాటు చేసిన కార్పెట్లు పాడైపోయి అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్నాయి. ఇక క్షేత్రంలోని (Cheruvugattu Temple) పుష్కరిణి పరిస్థితి మరింత దారుణంగా మారింది. నీటిని సమయానికి మార్చకపోవడంతో పుష్కరిణి నీరు కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. అయినప్పటికీ భక్తులు అదే నీటిలో స్నానం చేయాల్సి వస్తోంది.
దీంతో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఈ దేవస్థానంలో కనీస సౌకర్యాలు లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తక్షణమే త్రాగునీరు, నీడ, చలువ తివాచీలు ఏర్పాటు చేయడంతో పాటు పుష్కరిణి నీటిని శుద్ధి చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య పెంపునకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
Follow Us On : WhatsApp

