కలం, వెబ్ డెస్క్: వైసీపీ హయాంలో 2022లోనే కల్తీ నెయ్యిపై (Spurious Ghee) రిపోర్టు వచ్చిందని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. ఆ విషయాన్ని ఎందుకు తొక్కిపెట్టారని ప్రశ్నించారు. నెయ్యిని కల్తీ చేసినందుకు చర్యలు తీసుకోకుండా దాన్ని అలాగే కొనసాగించారని ఆరోపించారు. కల్తీ నెయ్యి అంశంపై విచారణ కొనసాగితే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయని తెలిపారు. టీటీడీ బోర్డ్ చైర్మన్కు తెలిసే కల్తీ జరిగిందని ఆరోపించారు. మెంబర్లను కూడా తమకు సంబంధించిన వాళ్లనే పెట్టుకొని పర్చస్ కమిటీలో నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ఇప్పుడు మళ్లీ వాళ్లే ఎదురుదాడి చేస్తున్నారన్నారు. ఇది మంచి పద్దతి కాదని సీఎం సూచించారు. దౌర్జన్యం చేస్తే ఊరుకునే రోజులు పోయాయన్నారు.
వివేకానంద్ రెడ్డి హత్య (YS Vivekananda) చేసి మరుసటి రోజు కత్తి నా చేతిలో పెట్టారని సీఎం వ్యాఖ్యానించారు. ఇప్పుడు తిరుమల లడ్డూ వ్వవహారంలో కూడా అదే చేయాలని చూస్తున్నారన్నారు. భగవంతుడితో పెట్టుకోవడం మంచిది కాదన్నారు. ముస్లింలు మక్కాకు, క్రైస్తవులు జెరరూసలెంకు వెళ్లాలని ఎలా అనుకుంటారో… అలాగే హిందువులు తిరుపతికి వెళ్లాలని అనుకుంటారన్నారు. అలాంటి దైవం వేంకటేశ్వరస్వామిపై ఇప్పుడు దాడి జరిగిందన్నారు. భక్తుల నమ్మకం, విశ్వాసంపై దాడి చేశారన్నారు. జగన్కు వేంకటేశ్వర స్వామిపై భక్తి ఉంటే డిక్లరేషన్ పై ఎందుకు సంతకం పెట్టలేదని ప్రశ్నించారు. ఆయన వేరే మతస్తుడని, వేంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తున్నప్పుడు దేవుడు అంటే నమ్మకం ఉందని ఎందుకు సంతకం పెట్టలేదని అడిగారు.
దేవుడి పవిత్రతను కాపాడలేని అసమర్థులం కాదని, ఇష్టప్రకారం దాడి చేస్తే పట్టించుకోకుండా ఉండమని స్పష్టం చేశారు. అసలు లడ్డూలో నెయ్యి వాడలేదని, రసాయనాలు వాడారని అంటున్నప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఇది మహా పాపం కాదా అని.. దీనికి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదా అని చంద్రబాబు (Chandrababu) నిలదీశారు.
Read Also: తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు నిజమే: పవన్ కల్యాణ్
Follow Us On: Instagram


