కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో నెలకొన్న ఇంధన కొరతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) స్పందించారు. సోమవారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ ద్వారా క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించిన సీఎం.. సరఫరాను గాడిలో పెట్టేందుకు కఠిన ఆదేశాలు జారీ చేశారు.
కలెక్టర్లు, ఉన్నతాధికారులు నేరుగా ఆయిల్ డిస్పాచ్ సెంటర్ల వద్దే ఉండి పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. రిటైల్ బంకులకు ఇంధనం చేరడంలో ఏమాత్రం జాప్యం జరగకుండా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి మూడు గంటలకు ఒకసారి పరిస్థితిని సమీక్షించి ఆర్టీజీ సెంటర్ ద్వారా నివేదికలు అందించాలని ఆదేశించారు.
కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్కు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఆయిల్ ట్యాంకర్ల రవాణాకు ఎక్కడా ఆటంకాలు కలగకుండా ఎస్పీలు జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ సమీక్షలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు పాల్గొని సరఫరా పునరుద్ధరణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ సత్వర నిర్ణయాలతో ఇంధన ఇబ్బందులు త్వరలోనే తొలగిపోయే అవకాశం ఉంది.

