కలం, వెబ్డెస్క్: ఏపీ టీడీపీలో ఎమ్మెల్యే బోండా ఉమా (Bonda Uma) వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఇటీవల గుంటూరులో కాపు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముద్రగడ సంతాప సభకు బోండా ఉమా హాజరయ్యారు. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీల నుంచి కాపు నేతలు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో బోండా ఉమా మాజీ మంత్రి అంబటిని ఆత్మీయంగా పలకరించారు. వీరిద్దరూ పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకోవడం హాట్ టాపిక్గా మారింది. దీనిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సభకు హాజరవడం, వైసీపీ నేతతో మాట్లాడటంపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.
ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను వైసీపీ నిర్వహించిన సభకు వెళ్లలేదని, జనసేన మాజీ నేత దాసరి రాము నిర్వహించిన ముద్రగడ సంతాప సభకు హాజరయ్యానని క్లారిటీ ఇచ్చారు. ఆ సభలో అంబటి రాంబాబు కనిపిస్తే మర్యాదపూర్వకంగా పలకరించానని చెప్పారు. వైసీపీ నేత జక్కంపూడి నిర్వహించిన సంతాప సభకు జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా వెళ్ల లేదా? అని బోండా ఉమా ప్రశ్నించారు. గతంలో బొత్స సత్య నారాయణను నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పలకరించలేదా? అని అడిగారు. వాళ్లను కూడా ఇలాగే వివరణ కోరుతారా అని పార్టీని ప్రశ్నించారు.
ఎవరి విషయంలో లేని వివాదాలు తన విషయంలోనే ఎందుకు జరుగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. తనను మాత్రం ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఎదురుతిరిగారు. కొద్ది రోజుల క్రితం మంత్రి పదవుల విషయంలో కూడా బోండా ఉమా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనతో సహా పలువురు టీడీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవుల విషయంలో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సవిత, పార్థసారథికి మంత్రి పదవులు కేటాయించడంపై బహిరంగంగానే వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా చంద్రబాబు కోరిన వివరణపైనా మండిపడ్డారు. దీంతో బోండా ఉమా వ్యవహారం ఇంకా ఏ మలుపు తిరుగుతుందోనని ఏపీ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది.

