కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తల (Women Entrepreneurs)ను తయారు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు మహిళలకు శుభాకాంక్షలు చెప్తూ ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. ఇప్పటికి లక్ష మంది మహిళలను మైక్రో, ఎంఎస్ఎంఈ ఎంట్రప్రెన్యూర్లుగా తయారు చేశామన్నారు. ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడం నుంచి ప్రారంభమైన మహిళా సాధికారిత ప్రస్థానం ఈనాడు మహిళలను పారిశ్రామిక వేత్తలుగా చేసే విధంగా కొనసాగుతోందని తెలిపారు.
మహిళల అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం, స్త్రీ శక్తి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, దీపం-2 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, ఎన్టీఆర్ భరోసా వితంతు పింఛన్లు వంటి పథకాలను అమలు చేస్తున్నదని చెప్పారు. మెగా డీఎస్సీ ద్వారా 7955 మంది మహిళలకు టీచర్ ఉద్యోగాలు, 993 మహిళలకు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశాలకు గ్రాట్యుటీ అమలు చేస్తున్నామని వెల్లడించారు. మహిళల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ కేంద్రంతో కలిసి మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ నుండి రక్షణకు ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. మహిళల అభ్యున్నతి, భద్రత, గౌరవం, స్వేచ్ఛ కోసం అవసరమైన అన్ని కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. మహిళా సాధికారత విషయంలో మరిన్ని విజయాలు సాధించేందుకు అందరూ సహకారం అందించాలని పిలుపునిచ్చారు.

