కలం, వెబ్ డెస్క్: హోటళ్లు, రెస్టారెంట్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా కొన్నిచోట్ల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కొరత తీవ్రంగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల సరఫరాను పునరుద్ధరించినట్లు కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు దేశంలోని గ్యాస్ ఏజెన్సీలకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నుంచి మార్గదర్శకాలు విడుదలయ్యాయి.
కేంద్ర ఆయిల్ రిఫైనరీ విభాగ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ప్రస్తుతం ఎల్పీజీ కొరత లేదని తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో పరిశ్రమల అవసరాల కోసం కమర్షియల్ సిలిండర్లను నేరుగా సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయంతో ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సంస్థలు, హాస్పిటాలిటీ రంగానికి పెద్ద ఊరట లభించనుంది.
ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ వంటి ఇంధనాల కొరత ఎక్కడా నమోదు కాలేదని ఆమె స్పష్టం చేశారు. ప్రజలు భయాందోళనలకు గురై అవసరానికి మించి బుకింగ్లు చేసుకోవద్దని సూచించారు. దేశంలో ఎల్పీజీ నిల్వలు తగినంతగా ఉన్నాయని, ప్రభుత్వం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. గృహ వినియోగదారులతో పాటు కమర్షియల్ వినియోగదారులకు కూడా సరఫరా నిరంతరంగా కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
అంతర్జాతీయ సముద్ర మార్గాల పరిస్థితులపై కూడా ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో Strait of Hormuz ప్రాంతం గుండా ఎల్పీజీ నౌకల రాకపోకలను పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల రెండు ఎల్పీజీ ట్యాంకర్లు సురక్షితంగా ఈ సముద్ర మార్గాన్ని దాటాయని, మరికొన్ని ట్యాంకర్లు కూడా అదే మార్గం గుండా ప్రయాణించేందుకు సిద్ధంగా ఉన్నాయని సమాచారం.

