కలం, నల్లగొండ బ్యూరో: సూర్యాపేట జిల్లా కోదాడ (Kodad) పట్టణంలో అక్రమంగా కొనసాగుతున్న గ్యాస్ రీఫిల్లింగ్ దందాను సివిల్ సప్లై అధికారులు గుట్టురట్టు చేశారు. పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్న వ్యవహారంపై అధికారులు పక్కా సమాచారంతో మెరుపు దాడి చేశారు. అంబేద్కర్ కాలనీలోని కృష్ణారెడ్డి అనే వ్యక్తి తన ఇంటిని అక్రమ వ్యాపారానికి కేంద్రంగా మార్చుకున్నాడు. డొమెస్టిక్ సిలిండర్ల నుంచి చిన్న సిలిండర్లలోకి గ్యాస్ను రీఫిల్లింగ్ చేస్తూ అధిక ధరలకు అమ్ముతున్నాడు.
ఈ దాడుల్లో 42 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. రీఫిల్లింగ్ (Refill) కోసం వినియోగించే పరికరాలను స్వాధీనం చేసుకొని నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. నివాస ప్రాంతాల మధ్య రీఫిల్లింగ్ చేయడం వల్ల భారీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

