కలం, వెబ్ డెస్క్: చమురు ధరలు పెరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్లో 30 శాతం ఇథనాల్ (Ethanol) కలిపేందుకు అంగీకరించింది. ఈ మేరకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటిదాకా 20 శాతం ఇథనాల్ కలుపుతుండగా.. దీన్ని 40 శాతానికి పెంచాలని పలు రాష్ట్రాలు ఎప్పటి నుంచో కోరుతూ వస్తున్నాయి. మధ్యే మార్గంగా 30 శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
దిగుమతులు తగ్గి.. రైతులకు లాభం పెరిగి..
పెట్రోల్లో ఇథనాల్ కలపడం వలన రెండు రకాల లాభాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. దేశానికి గుది బండగా మారిన పెట్రోల్ దిగుమతుల భారం తగ్గడంతో పాటు ఇథనాల్ ముడిసరకుగా ఉన్న చెరకు, మొక్కజొన్న రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది. వాస్తవానికి బ్రెజిల్ వంటి దేశాల్లో ఈ విధానంతో రైతులు అధిక లాభం పొందుతున్నారు. ఒకప్పుడు పునరుత్పాదక ఇంధనం, జీవ ఇంధనాలు, హరిత హైడ్రోజన్ కేవలం పర్యావరణ పరిరక్షణ అంశాలుగా మాత్రమే పరిగణించారు. అయితే, మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇవే దేశానికి వ్యూహాత్మక అవసరాలతో పాటు స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని అందిస్తున్నాయి.

