కలం, వెబ్ డెస్క్ : వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే దేశవ్యాప్త జనాభా లెక్కల సేకరణకు కేంద్ర హోంశాఖ పరిధిలోని సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం 40 ప్రశ్నలు రూపొందించింది. దేశంలోనే ఫస్ట్ టైమ్ కులాలవారీ లెక్కలను (Caste Census) సేకరిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసినా, స్వయంగా ప్రధాని మోదీ వివరించినా ఈ ప్రశ్నల్లో మాత్రం బీసీ కులాల ప్రస్తావన లేదు. కేవలం ఎస్సీ, ఎస్టీ అని మాత్రమే ప్రస్తావించింది.
ఇటీవల ముగిసిన హౌజ్ లిస్టింగ్ ప్రశ్నల్లోనూ ఎస్సీ, ఎస్టీ అనే వివరాలనే సేకరించింది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీల నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సెన్స్లో ఫస్ట్ ఫేజ్ ఇండ్ల వివరాల సేకరణ ఉంటుందని, సెకండ్ ఫేజ్లో జనాభా లెక్కల సేకరణ జరుగుతుందని, అప్పుడు ప్రతీ ఒక్కరి వ్యక్తిగత వివరాలతో పాటు కులాల లెక్కలను కూడా సేకరిస్తామని ప్రధాని, హోం మంత్రి వివరించారు. కానీ తాజాగా (ఆగస్టు 14న) హోంశాఖ వెలువరించిన గెజిట్లో మాత్రం మొత్తం 40 ప్రశ్నల్లో 10వ ప్రశ్నలో ఎస్సీ, ఎస్టీ అని మాత్రమే పేర్కొనడం సరికొత్త వివాదానికి తావిచ్చినట్లయింది.

