కలం, కరీంనగర్ బ్యూరో: భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనకు జనాభా గణన ఎంతో కీలకమైందని కరీంనగర్ (Karimnagar) నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. నగరంలో ముమ్మరంగా కొనసాగుతున్న తొలి దశ జనాభా గణన (సెన్సెస్) ప్రక్రియలో భాగంగా మంగళవారం పలు డివిజన్లలో పర్యటించారు. రాంనగర్, మంకమ్మతోట తదితర ప్రాంతాల్లో పలు హౌజ్ లిస్ట్ బ్లాక్లను స్వయంగా తనిఖీ చేసి పరిశీలించారు. గణనలో చేపడుతున్న విధానం, నెంబరింగ్, వివరాల సేకరణ, నమోదు తదితర విషయాలపై ఎన్యూమరేటర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇళ్ల వివరాల సేకరణే కీలకం..
ఈ సందర్భంగా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ… జన గణనలో ప్రతి ఇంటిని సర్వే చేయాలన్నారు. హౌజ్ నంబరింగ్, నివాస గృహాల వివరాల సేకరణ అత్యంత కీలకమని తెలిపారు. ఎన్యూమరేటర్లు తమకు కేటాయించిన బ్లాక్ల పరిధిలో ప్రతి ఇంటిని సందర్శించి, కచ్చితమైన వివరాలను సేకరించాలన్నారు. సర్వేను సూపర్ వైజర్లు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు. నగర వ్యాప్తంగా దాదాపు 1,66,231 నివాస గృహాలు సర్వే చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు దాదాపు హౌజ్ లిస్ట్ బ్లాక్ వారీగా మొత్తం 98,064 నివాస గృహాలు పూర్తైనట్లు తెలిపారు. స్వీయ గణన చేసుకున్న వారు యూనికోడ్ ఐడీ నెంబర్ వివరాలను మీ వద్దకు వచ్చే ఎన్యూమరేటర్లకు అందించాలని పిలుపు నిచ్చారు. నగర ప్రజలు జన గణన ప్రక్రియకు పూర్తి స్థాయిలో సహాకరించి… కచ్చితమైన వివరాలను అందిస్తే…ఈ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు గణాంకాలే ప్రాతిపదిక అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇన్ఛార్జి అధికారి వేణు, ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లు పాల్గొన్నారు.

