కలం, కరీంనగర్ బ్యూరో: జగిత్యాలలో ఆర్టీసీ డ్రైవర్ అశోక్ను తొలగించారంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. అశోక్ ఆర్టీసీ ఉద్యోగి కాదని, కేవలం అద్దె ప్రాతిపదికన బస్సులు నడుపుతున్నాడని వివరించారు. అయినప్పటికీ, అతడిని ఉద్యోగం నుంచి తొలగించవద్దని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ, ప్రైవేట్ బస్సు యాజమాన్యంతోనూ మాట్లాడినట్లు చెప్పారు. రైతుల పక్షాన అశోక్ మాట్లాడటాన్ని స్వాగతిస్తున్నామని.. సద్విమర్శలు ఎవరూ చేసినా స్వీకరిస్తామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో అనేక కొర్రీలు పెడుతోందన్నారు. అయినా రైతులు ఇబ్బంది పడొద్దని.. కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్చలు తీసుకుంటోందన్నారు. ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేయొద్దని హితవు పలికారు.

