కలం, వెబ్ డెస్క్ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సంచలన నిర్ణయం తీసుకుంది. జూలై 1, 2026 నుంచి 9, 10 తరగతుల విద్యార్థులకు త్రిభాషా విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ జాతీయ విద్యా విధానం (NEP 2020), నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ (NCF-SE 2023) సూచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది.
ఈ కొత్త విధానం ప్రకారం… 9, 10వ తరగతి చదివే ప్రతి విద్యార్థి ఇకపై కనీసం మూడు భాషలను ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే విద్యార్థులు ఎంచుకునే ఆ మూడు భాషలలో ఖచ్చితంగా రెండు భారతీయ భాషలు ఉండాలని స్పష్టం చేసింది. మిగిలిన ఒక భాషగా విద్యార్థులు తమకు నచ్చిన ఏదైనా ఒక విదేశీ భాషను ఐచ్ఛికంగా ఎంచుకోవచ్చని పేర్కొంది. విద్యార్థులకు స్థానిక, జాతీయ భాషలతో పాటు అంతర్జాతీయంగా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.

