కలం, వెబ్డెస్క్: అన్నమయ్య జిల్లా (Annamayya district) వాయల్పాడు సమీపంలోని గండబోయినపల్లె టోల్గేట్ వద్ద సిబ్బందిపై దాడి చేసిన ఘటనలో కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సరేంద్ర బాబు (Amilineni Surendra Babu) అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఆపుతారా అంటూ సురేంద్ర బాబు అనుచరులు తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. టోల్గేట్ మేనేజర్ రవితో పాటు మహిళా ఉద్యోగి శ్రీలతపై కూడా దాడికి పాల్పడ్డారు. మేనేజర్ రవిని కారులో ఎత్తుకెళ్లి చితకబాదారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో సీఎం చంద్రబాబు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై టోల్గేట్ మేనేజర్ రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాయల్పాడు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు. ఎమ్మెల్యే అనుచరులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. టోల్గేట్ వద్ద జరిగిన ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పటికీ విస్తృతంగా షేర్ అవుతున్నాయి. బాధితులకు న్యాయం చేయాలని, విధుల్లో ఉన్న సిబ్బందిపై ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

