కలం, వెబ్ డెస్క్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాన రహదారి (Shamshabad)పై భారీ ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక మహేంద్రా కారు రన్నింగ్లో ఉండగానే ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. శాతంచాయి నుండి శంషాబాద్ వైపు వెళ్తుండగా ఇంజిన్ భాగం నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్, వెంటనే అప్రమత్తమై వాహనాన్ని నిలిపివేశారు. లోపల ఉన్న ప్రయాణికులు వెంటనే కిందకు దిగడంతో పెను ప్రమాదం తప్పి అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
ప్రయాణికులు దిగిన క్షణాల్లోనే మంటలు కారు మొత్తం వ్యాపించి, చూస్తుండగానే వాహనం అగ్నికీలలకు ఆహుతైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే ఈ ప్రమాదం కారణంగా ఎయిర్పోర్టుకు వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. శాతంచాయి నుంచి శంషాబాద్ వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.

