కలం, వెబ్ డెస్క్: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భగ్గుమంటున్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి బీఆర్ఎస్వీ నేతలు (BRSV) యత్నించారు. తేజస్వీ సూర్య తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని, తెలంగాణ ప్రజలకు క్షమాణపలు చెప్పాలని డిమాండ్ చేస్తూ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్దకు వచ్చారు. తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ.. రాష్ట్ర బీజేపీ కార్యాలయం వద్ద ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఖబడ్దార్ తేజస్వీ సూర్య అంటూ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. ముందే సమాచారం అందుకున్న పోలీసులు వారిని రోడ్డుపైనే అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. నాంపల్లి ప్రధాన రహదారిపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. తేజస్వీ సూర్యపై బీజేపీ యాక్షన్ తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.

