కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఈ మేరకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు, ఇతర సీనియర్ నాయకులు కలిసి కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్షీట్ (BRS Chargesheet) విడుదల చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ (KTR) మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్నది పాలన కాదని, అది కేవలం ప్రజా పీడన మాత్రమేనని ధ్వజమెత్తారు. గడిచిన 1000 రోజుల సమయం పూర్తిగా క్రిమినల్ వేస్ట్ అని, ఈ కాలానికి ఉన్న విలువ సున్నా అని వ్యాఖ్యానించారు. అబద్ధం, అజ్ఞానం, అరాచకం, అవినీతి అనే నాలుగు తలలతో అనుముల నాగుపాములా ఈ పాలన ప్రజలను బుస కొడుతోందని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ రూపంలో దరిద్రం దండయాత్ర మొదలై 1000 రోజులు పూర్తయ్యాయని, ఇది అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైన సర్వభ్రష్ట ప్రభుత్వమని ఆరోపించారు. అధికారంలోకి వస్తే 100 రోజుల్లో స్వర్గం చూపిస్తామని చెప్పిన నాయకులు, ఇప్పుడు 1000 రోజులుగా ప్రజలకు నరకం చూపిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

