కలం, నిర్మల్: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ ఎన్నికల హామీల అమలులో వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో బుధవారం మహా ధర్నా (BRS Maha Dharna) నిర్వహించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట చేపట్టిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆరు గ్యారెంటీల అమలు వైఫల్యాలను వివరిస్తూ భారీ ఫ్లెక్సీని ప్రదర్శించి ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు నిర్మల్ నియోజకవర్గంలో వారం రోజులపాటు వివిధ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు తదితర వర్గాల సమస్యలను ప్రస్తావిస్తూ నిరసనలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

