కలం, ఖమ్మం బ్యూరో: మంత్రి పొంగులేటికి ఓటమి భయం పట్టుకుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు అన్నారు. బీఆర్ఎస్, సీపీఎం నేతలకు ఫోన్ చేసి ‘అన్నా.. ఈ ఒక్కసారి సాయం చేయండి. మిమ్మల్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా” అని బతిమిలాడుకుంటున్నారని ఆరోపించారు. గురువారం ఖమ్మం (Khammam) జిల్లాలోని ఎదులాపురం, వైరా మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ నాయకులు నామా నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్ కుమార్, తాతా మధు భారీ రోడ్ షో నిర్వహించి ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపారు. ప్రభుత్వం గ్యారంటీ కార్డు పేరుతో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఎలా విస్మరించిందో ‘బాకీ కార్డు’ పేరుతో వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పొంగులేటి ఓటమి భయంతో ప్రతిపక్ష పార్టీలపై అసహనం ప్రదర్శిస్తున్నారన్నారు.
కాంగ్రెస్ (Congress) ప్రభుత్వానికి ప్రజలు అధికారం ఇచ్చి ఇప్పటికే నష్టపోయారని, మళ్ళీ అలాంటి పొరపాటు చేయకుండా బీఆర్ఎస్ కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కొత్తగూడెంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గడప గడపకూ వెళ్లి కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేసి, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు.


