కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ (Congress) అధికారంలోకి రాకముందు బీసీ (BC)లకు ఎన్నో హామీలు ఇచ్చిందని, ఇప్పుడు ఒక్క హామీని కూడా పట్టించుకోవడం లేదని, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని బీఆర్ఎస్ (BRS) నేతలు గన్ పార్క్ వద్ద ధర్నాకు దిగారు. మాజీ మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా, బీసీ కార్పొరేషన్కు నిధులు కేటాయించకుండా ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు. బడ్జెట్లో బీసీలకు రూ.20 వేల కోట్లు పెట్టాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. బీసీ కార్పొరేషన్లకు వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో బీసీలకు ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. బీసీలకు సబ్ ప్లాన్ పెడతామని, సంవత్సరానికి రూ.20 వేల కోట్లు విడుదల చేస్తామని దొంగ హామీలు ఇచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ మోసపూరిత హామీల వల్ల ఇప్పుడు అంతా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలను స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ మోసం చేస్తూనే ఉందని విమర్శించారు. సమాజంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు సరైన అవకాశాలు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో బీసీలంతా రోడ్ల మీదికి వస్తారని, బీసీలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొంద పెడతారని వ్యాఖ్యానించారు. అనంతరం గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి ర్యాలీగా బయలుదేరారు.

