కలం, ముజఫర్నగర్: మంచి పని.. కడుపునిండా కూడు.. చేతినిండా జీతం.. ఇస్తామంటూ నమ్మించి తీసుకొచ్చిన కార్మికులను ఒక ఫ్యాక్టరీలో బంధించి.. వెట్టిచాకిరీ చేయించిన ఘటన (Bonded Labor in UP Factory) యూపీలోని ముజఫర్నగర్ జిల్లాలో వెలుగుచూసింది. రెండేండ్ల పాటు 13 మంది కార్మికులను ఫ్యాక్టరీ నాలుగు గోడల మధ్య బంధించి.. పశువుల కంటే హీనంగా చూశారు. గోడలు దూకి తప్పించుకోవాలని చూస్తే కరిపించడానికి ఫ్యాక్టరీ ఆవరణలోనే రెండు పిట్బుల్ బ్రీడ్ కుక్కలను కాపలా ఉంచారు. లేబర్ డిపార్ట్మెంట్, లోకల్ పోలీసులు కలిసి ఫ్యాక్టరీపై నిర్వహించిన మెరుపు దాడితో ఈ దారుణం బయటపడింది.
బ్యాగులు తయారు చేసే ఈ ఫ్యాక్టరీ నుంచి 13 మంది కార్మికులను రక్షించారు. కార్మికులను హర్యానా, పంజాబ్, రాజస్థాన్, జార్ఖండ్, బీహార్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లోని వివిధ జిల్లాలతో పాటు నేపాల్ నుంచి ఇక్కడికి తీసుకువచ్చినట్లు అధికారులు గుర్తించారు. తమపై జరిగిన దారుణాలను వివరిస్తూ కార్మికులు కన్నీరు పెట్టుకున్నారు. ‘‘మంచి జీతాలు ఇస్తామని ఆశచూపి మమ్మల్ని ఇక్కడికి తెచ్చారు. కానీ ఫ్యాక్టరీలోకి రాగానే మా మొబైల్ ఫోన్లు, ఆధార్ కార్డులను బలవంతంగా లాక్కున్నారు. దీంతో మా కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం లేకుండాపోయింది. కనీసం బయటకు తప్పించుకోవడానికి కూడా వీల్లేకుండా పోయింది’’అని ఆవేదన వ్యక్తం చేశారు.
24 గంటల్లో ఒక్కసారే ఎండు రొట్టెలు ఇచ్చేవారు. తిండి సరిగ్గా పెట్టడం లేదని ప్రశ్నించినా.. బయటకు వెళ్తామని అడిగినా.. కొరడాలతో, కర్రలతో బాదేవారు. నెలల తరబడి జరిగిన ఈ దాడుల తాలూకు గాయాల గుర్తులు కార్మికుల శరీరాలపై స్పష్టంగా కనిపిస్తున్నాయి. కార్మికులందరికీ అధికారులు వైద్యం అందించారు. ఆ తర్వాత పూల మాలలు వేసి వారి వారి ఊళ్లకు పంపించారు.
ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు
“కార్మికులకు జీతాలివ్వకుండా బలవంతంగా పని చేయించుకున్నారు. వారిపై కుక్కలతో దాడి చేయించడం.. కర్రలతో పొడవడం, కొరడాలతో కొట్టడం, పశువుల దాణా పెట్టడం మనుషుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నది. బాధితులకు న్యాయం చేయాలి. అందరికీ పునరావాసం కల్పించాలి. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలి. కార్మిక చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలి.”
– రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత.

